జేడీఎస్ కార్యాలయంలో సినిమా సెట్

13 Jan, 2015 02:23 IST|Sakshi

దర్శన్ ‘ఐరావత’ షూటింగ్ పై  జేడీఎస్ నేతల్లో అసహనం
 
బెంగళూరు: ఎప్పుడూ రాజకీయ నేతలతో కిటకిటలాడే జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం సోమవారం ఖాకీలతో కిక్కిరిసింది. పార్టీ ప్రధాన కార్యాలయం కాస్తా పోలీస్ స్టేషన్‌గా మారిపోయింది. ప్రముఖ నటుడు దర్శన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఐరావత చిత్రం షూటింగ్‌కు పార్టీ కార్యాలయం ఆదివారం వేదికైంది. జేడీఎస్ ఎమ్మెల్సీ సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం జేడీఎస్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చేశారు. దీంతో జేడీఎస్ పార్టీ బోర్డును తొలగించి పోలీస్ స్టేషన్ బోర్డును కార్యాలయానికి తగిలించారు.

ఇక జేడీఎస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పును ప్రశ్నిస్తూ జేడీఎస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ అర్జీని సైతం దాఖలు చేశారు. ఈ గందరగోళం నడుమనే పార్టీ కార్యాలయాన్ని షూటింగ్ కోసం కేటాయించడంపై జేడీఎస్‌కు చెందిన కొందరు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విషయాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని జేడీఎస్ సీనియర్ నేతలు తమ ఆప్తుల వద్ద వాపోయినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు