దేశంలో మోడీ ప్రభంజనం

4 Jan, 2014 03:24 IST|Sakshi

గంగావతి, న్యూస్‌లైన్ :  దేశంలో మోడీ గాలి బలంగా వీస్తోందని కొప్పళ లోక్‌సభ మాజీ సభ్యులు, బీఎస్‌ఆర్ పార్టీ నేత కే.విరుపాక్షప్ప అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక ఎస్‌ఎస్ మోటర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను కొప్పళ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి అభిప్రాయానికి అనుగుణంగా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకుంటానన్నారు. బీఎస్‌ఆర్ పార్టీ నేత బీ.శ్రీరాములు సైతం బీజేపీలో చేరతారని, అయితే అంతిమ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, అయితే ఏ పార్టీలో చేరాలన్నది త్వరలో నిర్ణయిస్తానని చెప్పారు. సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఉద్దేశంతోనే కలిసింది వాస్తవమని ఒప్పుకున్న విరుపాక్షప్ప, ఆ పార్టీలో స్థానికుల వ్యతిరేకతను బట్టి ఆ పార్టీలోకి వెళ్లదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు తమ్మినేని రామచంద్ర, విఠలాపుర యమనప్ప, పక్కీరయ్య పాల్గొన్నారు.
 
‘కొప్పళ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నా’

 శ్రీరామనగర్, న్యూస్‌లైన్ : బీజేపీ తరపున కొప్పళ లోక్‌సభ టికెట్‌ను తాను ఆశిస్తున్నట్లు కొప్పళ మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప తెలిపారు. బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో స్థానిక నాయకులను తమ మద్దతుదారులు కలుస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం రాయచూరులో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ దేశ్‌పాండే, కనకగిరి బ్లాక్ బీజేపీ అధ్యక్షులు కే.సత్యనారాయణరావులను కలిసినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు