దావణగెరె : బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నగరంలోని శివకుమారస్వామి బడావణెలో జరిగింది. నగరానికి చెందిన మారుతి(17) అనే యువకుడికి గతంలో కుటుంబ సభ్యులు ఒక బైక్ని కొనివ్వగా, ఆ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడటంతో వారు ఆ బైక్ను ఇటీవల అమ్మేశారు.
అయితే తనకు మళ్లీ కొత్త బైక్ కొనివ్వాలని మారుతి పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు తన కోరికను పెడచెవిన పెట్టడంతో మనస్తాపం చెందిన మారుతి సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.