కళాశాల ఎదుటే మృత్యు ఒడిలోకి..

14 Oct, 2016 01:40 IST|Sakshi

మరికొన్ని అడుగులు వేస్తే కళాశాల.. ఇంతలో వాటర్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళింపు. కళాశాలకు కూతవేటు దూరంలోమృత్యు ఒడిలోకి తమ విద్యార్థులు  చేరడంతో అధ్యాపక సిబ్బంది ఆగ్రహంతో రోడ్డెక్కడంతో పోలీసులకు  ముచ్చెమటలు పట్టాయి. ఈవినింగ్ కళాశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థినులను ట్యాంకర్ లారీ బలిగొనడం సర్వత్రా విషాదంలో నెట్టింది.  - సాక్షి, చెన్నై
 
లారీ రూపంలో కబళింపు
ముగ్గురు విద్యార్థినుల బలి
మరో ముగ్గురి పరిస్థితి విషమం
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ట్రాఫిక్ పద్మవ్యూహంలో గిండి - సైదాపేట మార్గం
ఈవినింగ్ కళాశాలతో     ఉన్నత చదువు

 
సాక్షి, చెన్నై: చెన్నై మహానగరంలోని ప్రధాన మార్గం గిండి - సైదాపేట మీదుగా సాగే అన్నా సాలై. ఈ మార్గంలో నిత్యం వాహనాలు దూసుకెళ్తుంటాయి. గిండి నుంచి సైదాపేట వైపుగా మెట్రో రైలు పనులు ముగియడంతో రోడ్డు కాస్త విశాలంగానే ఉంటుంది. దీంతో అతి వేగంగా దూసుకెళ్లే వాహనాలు ఎక్కువే. ఇక్కడి వంతెనల కింద కూర్చుని జరిమాన మోత మో గించడం మీద ఉత్సాహం చూపించే ట్రాఫిక్ సిబ్బంది, ఆ మార్గం వెన్నంటి రోడ్డు దాటాలంటే గగనంతో సతమతం అవుతున్న వారికి సాయ పడేది అరుదే. గిండి - సైదాపేట మా ర్గంలో కొన్ని ప్రైవేటు సంస్థలు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్పిక్ తదితర కార్యాలయాలతో పాటు చెల్లమ్మాల్ మహిళా డిగ్రీ కళాశాల ఉంది.
 
ఇక్కడ ఈవినింగ్ క్లాసులు షిఫ్ట్‌ల వారీగా  సైతం జరుగుతూ వస్తున్నాయి. ఈ దృష్ట్యా, నిత్యం ఇక్కడికి విద్యార్థినులు వస్తూ వెళ్తుంటారు. అయితే, ఇక్కడికి రావాలంటే, గిండి బస్టాండ్ లేదా, చిన్న మలై బస్టాండ్ నుంచి సుమారు ఒకటిన్నర కిమీ దూరానికి పైగా  నడవాల్సిందే.  మధ్యలో బస్టాప్ ఉన్న , వంతెన మీద నుంచి దూసుకొచ్చే నగర రవాణా సంస్థ డ్రైవర్లకు ఆ స్టాప్ పట్టదు. దీంతో విద్యార్థినులు, సిబ్బంది తదిరులు  గిండి లేదా, చిన్నమలై నుంచి నడక సాగించాల్సిన పరిస్థితి. గురువారం నాటి ఘటనతో ఏ మేరకు విద్యార్థినులు రోడ్డు దాటేందుకు ఇక్కడ ఇక్కట్లకు గురి అవుతున్నారో,  కిలో మీటర్ల కొద్ది ఏ మేరకు నడక సాగించి కళాశాల మెట్లు ఎక్కుతున్నారో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇందుకు చెల్లించుకున్న మూల్యం ముగ్గురు విద్యార్థినుల ప్రాణాలు.
 
 కళాశాల  ఎదుటే...: మరికొన్ని  అడుగు వేస్తే కళాశాల, అయితే, క్షణాల వ్యవధిలో ట్యాంకర్ లారీ రూపంలో ముగ్గురు విద్యార్థినుల్ని మృత్యువు కబళించింది. ఏడుగురు విద్యార్థినులు గిండిలో బస్సు దిగి, కళాశాలకు నడచుకుంటూ వెళ్తున్నారు.  మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల సమయంలో గిండి వంతెన మీద నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ లారీ స్పిక్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద  ముందుగా వెళ్తున్న మోటార్‌సైకిళ్లను ఢీకొంది. లారీని అదుపు చేయని పరిస్థితిలో ఉన్న డ్రైవర్ మరింత ముందుకు తీసుకెళ్లి ఓ ఆటోను ఢీకొట్టాడు. ఆటోను ఢీకొని,  కళాశాల వైపుగా  అడుగులు వేస్తున్న విద్యార్థుల మీదుగా దూసుకెళ్లాడు.
 
మెట్రో రైలు వంతెనను ఢీకొని లారీ ఆగడంతో  క్షణాల్లో డ్రైవర్ ఉడాయించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఆ పరిసరాల్లో దూసుకెళ్తోన్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. పరుగున వెళ్లిన వాళ్లందరూ అక్కడి దృశ్యాల్ని చూసి తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంఘటన స్థలంలో ముగ్గురు విద్యార్థినులు విగత జీవులుగా మారడం, మరో విద్యార్థిని గాయాలతో కొట్టు మిట్టాడుతుండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ ట్యాంకర్ కారణంగా మోటారు సైకిలిస్టు, మరో వ్యక్తి తీవ్రగాయాలతో పడి ఉండడంతో ఆ ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాయపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
 ఉద్వేగం...ఆగ్రహం: తమ కళాశాల విద్యార్థినులు ప్రమాదంలో మరణించిన సమాచారంతో అక్కడి అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు బయటకు పరుగులు తీశారు.విగత జీవులుగా పడి ఉన్న సహచర విద్యార్థినులను చూసి బోరున విలపించారు.
 
అధ్యాపక సిబ్బంది ఉద్వేగానికి లోనయ్యరు. రోడ్డు మీదకు చేరుకుని తాము, తమ విద్యార్థినులు పడుతున్న దిన దిన గండం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి.ట్రాఫిక్ పోలీసులు ఉరకలు తీశారు. పోలీసులకే ముచ్చమటలు పట్టించే విధంగా మహిళా సిబ్బంది విరుచుకు పడ్డారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వారిని బుజ్జగించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఆ గమేఘాలపై మృతదేహాలను రాయపేట మార్చురీకి తరలించారు. మృతి చెందిన విద్యార్థినుల్లో  గాయత్రి, చిత్ర, ఆశ ఉన్నారు. గాయత్రి బీకాం ద్వితీయ సంవత్సరం, మిగిలిన ఇద్దరు తృతీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు చెందిన వారు కావడం గమనార్హం.
 
తమ పిల్లల మరణ సమాచారంతో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగాయి. ఈ ఘటన చెన్నై వాసుల్ని విషాదంలోకి నెట్టాయి. గాయపడ్డ వారిని మోటారు సైకిలిస్టు శివరాజ్, మరో విద్యార్థిని జయశ్రీ గా గుర్తించారు. మరొకరి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో అన్నా సాలై ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. ఇక,  ఉడాయించిన లారీ డ్రైవర్ విరుదునగర్‌కు చెందిన రాజేంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు