నేడు సూర్య, చంద్ర ప్రభ ఉత్సవాలు

18 Mar, 2014 02:37 IST|Sakshi

కదిరి, న్యూస్‌లైన్: లోకం.. పుట్టడం, జీవించడం, మరణించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడుని తానే అంటూ భక్తులకు చాటి చెప్పేందుకు నారసింహుడు మంగళవారం పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలను అధిష్ఠించి భక్తులకు దర్శనమిస్తారు.  సూర్య మండల మధ్యస్థుడైన శ్రీమహావిష్ణువుకు నారాయణుడనే పేరు కలదు. పగటికి సూర్యుడు రారాజు.

రేయికి చంద్రుడు అధిపతి. సృష్ఠికి ఎంతో ముఖ్యమైన ఈ రాత్రింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి వాటిని వాహనాలుగా చేసుకొని సృష్ఠిలో సర్వం తానే అని చాటిచెప్పడానికి తిరువీధుల్లో ఊరేగుతారు. సాధారణంగా ఉదయం గ్రామోత్సవం నిర్వహించి రాత్రి సమయంలో మాత్రమే శ్రీవారి విహారానికి వాహనం వినియోగిస్తారు.

అయితే రెండు వాహనాల్లో విహరించడం నేటి ఉత్సవ ప్రత్యేకత. ఉదయం యాగశాల ప్రవేశం, నిత్య హోమాలతో ప్రారంభ మై శ్రీవారి తిరువీధుల్లో సూర్య ప్రభ ఉత్సవం జరుగుంది. రాత్రి విశేష అలంకరణలతో నారసింహుడు చంద్ర ప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు