సెంట్రల్ ఢిల్లీలో నిలిచిపోయిన ట్రాఫిక్

23 Apr, 2015 23:46 IST|Sakshi

బీజేపీ నిరసన ప్రదర్శనే కారణం
 సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ఘటనకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీతో సెంట్రల్ ఢిల్లీలో గురువారం ఉదయం వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన జరిపి, ఢిల్లీ సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. బిజీగా ఉండే ఐటీఓ ప్రాంతంలో ఈ నిరసన ప్రదర్శన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాని ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా కనిపించింది. ఢిల్లీ గేట్, మండీ హౌజ్, మథురా రోడ్, తిలక్ మార్గ్, ఇండియా గేట్ తదిరత ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ఉండటం కోసం రోడ్లపై నిరసన ప్రదర్శన జరపరాదని బీజేపీ కార్యకర్తలను కోరినట్లు నగర పోలీసులు తెలిపారు. నిరసనకారులు, ప్రయాణికుల భద్రత కోసం పోలీసులు బారికేడ్లను అమర్చారు. రద్దీగా ఉండే  ప్రాంతంలో ట్రాఫిక్‌కు అడ్డంగా మారిన ఆందోళనకారులను చెదరగొట్టడం కోసం పోలీసులు వాటర్ కేన్లను ప్రయోగించారు. నిరసన ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండడం కోసం పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు.
 

మరిన్ని వార్తలు