శనివారం మధ్యాహ్నం నుంచి రైళ్లు పునఃప్రారంభం
హొసూరు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. హొసూరు సమీపంలోని ఆనేకల్-హొసూరు మధ్య కర్పూర గ్రామం వద్ద బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు-హొసూరు మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి యుద్ధ ప్రాతిపదికన రైలు మార్గం పునరుద్ధరణ పనులు చేపట్టారు.
దెబ్బతిన్న రైలు బోగీలను క్రేన్ల సాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి గురైన డి8, డి9, డి10, డి11 బోగీలను పక్కకు తొలగించారు. మిగతా బోగీలను ఆనేకల్ రైల్వేస్టేషన్కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రైలు పట్టాల మధ్య శ్రమించిన రైల్వే ఉద్యోగులు 500 మంది మరమ్మతు పనులను శనివారం ఉదయానికే పూర్తి చేశారు. తెగిపోయిన పట్టాలను 400 మీటర్ల వరకు సరిచేశారు.
20 కిలోమీటర్ల వేగం
కొత్తగా ఏర్పాటు చేసిన పట్టాలపై వారం రోజులు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు రైలు మార్గం మరమ్మతులు పూర్తయ్యాయి. మొదట గూడ్స్ రైలును పట్టాలపై నడిపి అధికారులు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు లోకమాన్యతిలక్ ఎక్స్ప్రెస్ రైలును మొదటి సారిగా నడిపారు.