పోలీసులకు టీవీ సిస్టర్స్ రాఖీలు

9 Aug, 2014 22:19 IST|Sakshi

 న్యూఢిల్లీ: హిందీ సీరియళ్ల అభిమానులకు శాస్త్రి సిస్టర్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదే పేరుతో ప్రసారమయ్యే సీరియల్‌లో అక్కాచెల్లెళ్లు కనిపించే నేహా పెడ్నేకర్ (అల్కానీ), ఇషితా గంగూలీ (అనుష్క), సోనల్ వెంగులూకర్ (దేవయాని), ప్రగతి చౌరాసియా (పియా) శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులకు రాఖీలు కట్టారు. ఈ షోలో పెద్ద అక్కగా కనిపించే నేహా మాట్లాడుతూ ఎవరికైనా రాఖీ కడుతున్నప్పుడు అతడు మనకు ఆపత్కాలంలో రక్షణ కల్పిస్తాడనే నమ్మకం కుదురుతుందని చెప్పింది.
 
 గత నెల శాస్త్రిసిస్టర్స్ షూటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పోలీసులు తమకు తగిన భద్రత కల్పించి ఆదుకున్నారని తెలిపింది. ఆపత్కాలంలో నలుగురు తోబట్టువుల ఐక్యమత్యం గురించి శాస్త్రి సిస్టర్స్ వివరిస్తుంది. కాన్పూర్ నుంచి ఢిల్లీ ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చాక ప్రేమలు, వేధింపులు, ఇళ్ల వంటి సమస్యలను ఎలా ఎదర్కున్నారో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. రక్షాబంధన్ అంటేనే భద్రత గుర్తుకు వస్తుందని, మనదేశానికి ఎంతో సేవ చేస్తున్న పోలీసులతోపాటు సాయుధ దళాలకు శిరసు వంచి వందనం చేయాల్సిందేనని మరో సిస్టర్ సోనల్ చెప్పింది. అన్నట్టు.. శాస్త్రి సిస్టర్స్ కలర్స్ చానెల్‌లో ప్రసారమవుతోంది.

మరిన్ని వార్తలు