నకిలీ నోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్

6 Jul, 2016 02:27 IST|Sakshi
నకిలీ నోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్

స్కానర్, నకిలీ నోట్లు స్వాధీనం
కేకే.నగర్: తిరునెల్వేలి మేల్‌పాళయంలో నకిలీ నోట్లను ముద్రించి చ లామణికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి నుంచి స్కానర్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వేలి మేలపాళయం, కొత్త బస్టాండు ప్రాంతంలో సోమవారం పోలీసులు గస్తీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో అనుమానాస్పద రీతిలో నిలబడి ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వారి వద్ద గల బ్యాగును పోలీసులు తనిఖీ చేశారు.

ఆ సమయంలో ఆ బ్యాగులో వంద రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకుని తిరునెల్వేలి నగర నేర విభాగ పోలీసు సహాయ కమిషనర్ మారిముత్తు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తరువాత వారిద్దరి వద్ద పోలీసులు విచారణ జరిపారు. విచారణలో వారు మేల్‌పాళయం ఆమ్ పురం 5వ వీధికి చెందిన కాశిమే బషీర్ కుమారుడు తమిమ్ అన్సారి (34) పేటై టీచర్స్ కాలనీకి చెందిన రహమతుల్లా (31) అని తెలిసింది. ఈ ఇద్దరూ మేలపాళయంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ నోట్లు ముద్రించి వాటిని చలామణి చేయడానికి వెళుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.

దీంతో పోలీసులు మేలపాళయం ఫాతిమానగర్‌కు వారిని పిలుచుకుని వెళ్లి వాళ్లు అద్దెకు తీసుకున్న ఇంట్లో సోదా చేశారు. ఆ ఇంట్లో రూ.500ల విలువైన 300ల నోట్ల కట్టలు కనిపించాయి. ఇంకనూ నకిలీనోట్ల తయారీకి ఉపయోగించిన స్కాన్, ప్రింటర్ మిషన్, పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్సారి, రహమతుల్లాలను అరెస్టు చేసిన పోలీసులు వారివద్ద గల రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై నెల్లై నగర పోలీసు కమిషనర్ తిరుజ్ఞానం మాట్లాడుతూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తమకు అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి లక్షా 50వేల రూపాయలు విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా స్కాన్, ప్రింటర్, పేపర్లను రెండు మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు