రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

29 Nov, 2016 09:33 IST|Sakshi

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాలు.. కేరళ రాష్ట్రం మలక్‌పురా జిల్లా పెరుంతల్ మన్నాకు చెందిన ఆల్శిఫా ఫార్మా కాలేజీకి చెందిన 28మంది విద్యార్థులు, ముగ్గురు ట్యూటర్లు విజ్ఞాన యాత్రకు సోమవారం సాయంత్రం టూరిస్టు బస్సులో బయలుదేరారు.

రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని తప్పించబోయి ఆగి ఉన్న పైపుల కంటైనర్‌ను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోకి పైపులు చొచ్చుకురావడంతో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలు బస్సులో ఇరుక్కుపోయాయి. గాయపడిన విద్యార్థులను ఎస్‌వీఎస్, మరికొందరిని బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. వారంతా క్షేమంగా ఉన్నారు. జడ్చర్ల పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి క్రేన్ సాయంతో బస్సును, కంటైనర్‌ను వేరు చేసి మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు