రంగారెడ్డిజిల్లాలో ఇద్దరు టీచర్లు అదృశ్యం

3 Nov, 2016 22:28 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా : ఒకే పాఠశాలలో పని చేసే ఇద్దరు ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారు. నాలుగు రోజులుగా వారు పాఠశాలకు రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శంకర్‌పల్లి మండలం చిన్నశంకర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు మల్లికార్జున్, సునీత గత నెల 31 నుంచి పాఠశాలకు రావడం లేదు.

గ్రామస్తులు ఈ విషయాన్ని వైస్‌ఎంపీపీ శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన మండల విద్యాధికారి అక్బర్‌కు సమాచారమందించారు. ఎంఈఓ వెంటనే ఆ పాఠశాలను సందర్శించి తాత్కాలికంగా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. నాలుగు రోజుల నుంచి సమాచారం లేకుండా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి సత్యనారాయణరెడ్డికి నివేదిక సమర్పించారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ప్రతి రోజూ వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి శంకర్‌పల్లికి వచ్చి విధులు నిర్వర్తించేవారు. గత నెల 31న పాఠశాలకు వెళుతున్నానని తాండూరు నుంచి బయలుదేరిన సునీత తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు, భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు టీచర్ల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు