ఉబర్ రేప్ కేసులో...ముగ్గురు సాక్షుల వాంగ్మూలం నమోదు

20 Jan, 2015 23:03 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్‌లో ఉబర్ క్యాబ్‌లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి స్థానిక అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం ముగ్గురు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ వాడిన మొబైల్ ఫోన్‌లో నమోదైన కాల్ రికార్డు వివరాలను వోడాఫోన్ కంపెనీ అధికారి న్యాయమూర్తి కావేరీ బవేజాకు అందజేశారు. అంతకుమందు ఇదే కేసుకు సంబంధించి న్యాయస్థానం ఏడుగురు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన సంగతి విదితమే.
 
 సహఖైదీలు దాడి చేశారు
 అంతకుముందు నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ తర ఫు న్యాయవాది అలోక్ ద్వివేది  వాదనలను వినిపిస్తూ తన క్లయింట్‌పై సహఖైదీలు దాడి చేసి కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీన జరిగిందన్నారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి దీనిపై నివేదిక ఇవ్వాలంటూ లాకప్ ఇన్‌చార్జిని ఆదేశించారు. తనకు తగు భద్రత కల్పించాలని నిందితుడు యాదవ్... న్యాయమూర్తిని కోరారు. యాదవ్‌కు తగు భద్రత కల్పించాలని న్యాయమూర్తి తీహార్ కారాగారం అధికారులను ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు