సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

4 Aug, 2019 14:09 IST|Sakshi

సాక్షి, బెంగళూరు :  కన్నడ ప్రముఖ వ్యాపార వేత్త, కెఫె కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు సంబంధించిన శవ పరీక్షల నివేదిక రావడానికి మరింత ఆలస్యమవుతుందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక రావడానికి రెండు నెలలకు పైగా సమయం పడుతుందని, ల్యాబ్‌ నివేదిక వచ్చిన తరువాత అది హత్య లేక ఆత్మహత్య తేలుతుందన్నారు. అయితే సిద్ధార్థ నీటిలో పడి ఊపిరి ఆడక మృతి చెందాడని ప్రాథమిక నివేదిక వచ్చిందని తెలిపారు. కాగా   గత సోమవారం నేత్రావతి నది వద్ద అదృశ్యమైన వీజీ సిద్ధార్థ్‌ మృతదేహం బుధవారం ఉదయం సమీపంలోని నదీ జలాల్లో లభ్యమైన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధార్థ అనుమానస్పద మృతిపై మంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఐటీ వేధింపులే కారణం 
‘కెఫె కాఫీ డే యజమాని సిద్ధార్థ ఆత్మహత్యకు ముఖ్య కారణం ఐటీ అధికారుల వేధింపులే. ఐటీ శాఖ రిటైర్డు ఉన్నతాధికారి బాలకృష్ణను తక్షణమే అరెస్ట్‌ చేసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. సిద్ధార్థ తన ఇబ్బందులపై లేఖలో రాశారని, ఇబ్బందులకు కారణమైన ఐటీ శాఖ అధికారులను తక్షణమే అరెస్ట్‌ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు