'ఏఎస్సై మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి'

22 Sep, 2016 12:39 IST|Sakshi
కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారి ఏఎస్‌ఐ మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షులు మహేందర్‌రెడ్డితో పాటు లోక్‌సత్తా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోహన్‌రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోహన్‌రెడ్డి జైల్‌లోనే ఉంటేనే అతనిపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో జైల్లో ఉన్న మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలు వెదజల్లి బెయిల్ పొందేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు.
 
నయీం కుటుంబసభ్యుల మాదిరిగా మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే కొత్తకోణాలు బయటికి వస్తాయని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు పోలీస్ వర్గాల మధ్య అంతర్గత పోరుతో ఒక వర్గం నయీంను ఆశ్రయించి పైచేయి సాధించిందని ఆ వర్గమే మోహన్‌రెడ్డి ముఠా అని ఆరోపించారు. సిట్ అధికారులు నయీం, మోహన్‌రెడ్డిల సంబంధాన్ని బయటికి తీయాలని, మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
 
మరిన్ని వార్తలు