సాక్షి, చెన్నై : తమిళనాడులోని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు దాదాపు ప్రాణాలు తీసినంత పనిచేశారు. ఖాకీ డ్రెస్సును అడ్డం పెట్టుకొని తాము కూడా మనుషులం అనే సంగతి మరిచి ప్రవర్తించారు. మణికంఠన్ అనే డ్రైవర్పట్ల అమానుషంగా వ్యవహరించడంతో అవమాన భారంతో వారి ముందే పెట్రోల్ పోసుకొని అతడు నిప్పంటించుకున్నాడు. సగానికిపైగా కాలిన గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
మణికంఠన్ అనే డ్రైవర్ కాల టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడిని సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు కూలదూషణ చేయడంతోపాటు దారుణంగా కొట్టారు. దీంతో అతడు అక్కడే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇదంతా చూస్తున్న స్థానికులు పోలీసులు తీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగి నిలదీశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని దుమ్ముదులిపేశారు. వీడియో కాస్త ఇప్పుడు బయటకు రావడంతో సంచలనంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి పోలీసుల తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ విషయం కాస్త అధికారులకు తెలియడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.