త్వరలో ‘ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టమ్’ లోకల్ రైళ్లు

12 Mar, 2015 22:59 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టమ్స్ లోకల్ రైళ్లు త్వరలో నగర వాసులకి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే వారం ప్రయోగాత్మకంగా ఒక బోగీని ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న లోకల్ రైలుకు ఈ బోగీని అమర్చనున్నారు. అయితే తేదీ ఇంకా ఖరారు చేయలేదని పశ్చిమ రైల్వే ప్రజా సంబంధాల అధికారి శరద్ చంద్రాయన్ వెల్లడించారు. రద్దీ సమయంలో నడుస్తున్న లోకల్ రైళ్లలోంచి ప్రయాణికులు కిందపడి మరణించడం, గాయపడటం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి.

ఫుట్ బోర్డుపై ప్రయాణించొద్దని మార్గదర్శక శిబిరాలు నిర్వహించినప్పటికీ మార్పు లేకపోవడంతో ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టం ప్రవేశపెట్టాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ముంబైలోని మహాలక్ష్మి వర్క్ షాపులో 12 బోగీలతో కూడిన లోకల్ రైలుకు సాంకేతిక మార్పులు చేస్తున్నారు. వర్క్‌షాపులో నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమవడంతో వచ్చేవారం ప్రయోగత్మకంగా ఒక ఖాళీ బోగీ నడపనున్నట్లు చంద్రాయన్ తెలిపారు. బోగీ కంట్రోల్ ప్యానెల్ మోటర్ గార్డు వద్ద ఉంటుందని, డోరు మూసుకున్నాకే రైలు కదులుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నగరంలోని లోకల్ రైళ్లకు ఇలాంటి డోర్లు అమర్చాలంటే సుమారు రూ. 1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 12 బోగీల ఒక్కో రైలుకు రూ. 4.5 కోట్లు ఖర్చవుతుందన్నారు.

మరిన్ని వార్తలు