కరోనా భయం.. మూడు రోజులు గడిచినా!

19 Jul, 2020 08:38 IST|Sakshi
మునిసింగి గ్రామంలో పాఠశాలలో ఉన్న బాధితులు  

సాక్షి, ఒడిశా: రాష్ట్రంలో గంజాం జిల్లా అంటే కరోనా అన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. బరంపురం నుంచి గజపతి జిల్లాకు తిరిగొచ్చిన పేషెంట్లను గ్రామాల్లోకి ప్రజలు రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి ఘటనే గజపతి జిల్లా రాయఘడ సమితి డోంబా పంచాయితీ మునిసింగి గ్రామంలో జరిగింది. మునిసింగి గ్రామానికి చెందిన సావిత్రి రయితో బరంపురంలోని ఎంకేజీసీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఆమెతో పాటు కూతురు నిత్యా రయితో కూడా సహాయం కోసం ఉంది. చనిపోయిన తల్లి సావిత్రి  రయితోను మునిసింగి గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. అయితే అక్కడికి వారం రోజుల తరువాత అస్వస్థతతో నిత్యారయితో (48) కూడా చనిపోవడంతో గ్రామస్తులు కరోనా వైరస్‌ వల్లే చనిపోయిందని భావించి ఆ కుటుంబ సభ్యులను దూరం పెట్టారు. వారి కుటుంబసభ్యులు 14 మందిని గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్‌లో ఉంచారు.  

గ్రామంలో ఉన్న వారందరూ చందాలు వేసుకుని వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జమ్ము వీధికి చెందిన ఏడుగుర్ని కూడా పాఠశాలలోనే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. ఇప్పటికి మూడు రోజులు గడిచినా గ్రామస్తులు వారిని వదలడం లేదు. వారందరినీ ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని రాయఘడ సమితి మాజీ  అధ్యక్షుడు మోహన్‌ భుయ్యాన్, సమితి సభ్యులు ఫుల్లోమతి గొమాంగో, గచ్చురాం రయితోలు కలెక్టర్‌ను, గ్రామస్తులను  కోరుతున్నారు.

మరిన్ని వార్తలు