వైఫై ప్రాజెక్టు కార్యరూపం

17 Aug, 2014 22:16 IST|Sakshi

 ఖాన్ మార్కెట్ పరిసర ప్రాంత ప్రజలకు వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో కన్నాట్ ప్లేస్‌వాసులు కూడా వీటిని వినియోగించుకునే అవకాశముంది. ఈ దిశగా ఎన్డీఎంసీ ముందుకు సాగుతోంది.  న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఫై ప్రాజెక్టు చేపట్టిన వైఫై ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. నగర ంలోని ఖాన్ మార్కెట్‌లో ఇందుకు సంబంధించిన సేవలు కొద్దిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. నగరంలోఈ తరహా సేవలు ప్రారంభమవడం ఇదే తొలిసారి. త్వరలో కన్నాట్‌ప్లేస్‌లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతంగా సాగుతోందని దీని బాధ్యతలను నిర్వహిస్తున్న ఓపీ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను పూర్తిచేయడం ద్వారా ఖాన్ మార్కెట్ పరిసరాల్లో నివసించేవారు వినియోగించుకోవచ్చన్నారు.
 
 ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యేందుకుగాను తాము వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) అందజేస్తామన్నారు. ఉచిత వినియోగం పూర్తయ్యాక స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవి నగరంలోని అన్ని దుకాణాల్లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఖాన్ మార్కెట్‌లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఎంసీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కన్నాట్‌ప్లేస్ అతి పెద్ద ప్రాంతమని, అయితే కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి తమకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదిలాఉంచితే భారీఎత్తున కేబుళ్లను వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల పరిసరాలు వికృతంగా మారకుండా చేసేందుకుగాను కన్నాట్‌ప్లేస్‌లోని 1.2 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని వినియోగించుకోనున్నామని తెలిపారు.
 
 సర్వీస్ ప్రొవైడర్ల భరోసా
 ఎన్డీఎంసీ ఆలోచన ఇలా ఉండగా ఈ నెలాఖరునాటికల్లా కన్నాట్‌ప్లేస్ పరిసరాల్లో వైఫై సేవల అందుబాటులోకి తీసుకొస్తామని సర్వీస్ ప్రొవైడర్లయిన టాటా డొకొమో, వోడా ఫోన్ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. కన్నాట్‌ప్లేస్ పరిధిలోని ఎన్‌బ్లాక్‌లో ప్రస్తుతం ైవె ఫై సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ైవె ఫై సేవలు జూలైలోనే ప్రారంభం కావాల్సి ఉంది. వివిధ సాంకేతిక సమస్యల కారణంగా అది కాస్తా ఆలస్యమైంది. అంతేకాకుండా కొన్ని భద్రతా విభాగాలు కూడా అభ్యంతరం చెప్పడం కూడా జాప్యానికి కారణమైంది. తమ నెట్‌వర్క్‌లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించిన ఆ సంస్థలు అభ్యంతరం చెప్పాయి. అయితే టెలిఫోన్ శాఖ నుంచి  సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన అనుమ తులను పొందుతారంటూ తాము ఆ సంస్థలకు భరోసా ఇచ్చామని, దీంతో ఈ వివాదానికి తెరపడిందని ఆయన వివరించారు. కన్నాట్‌ప్లేస్‌లో వైఫై నెట్‌వర్క్ ఏర్పాటు సమ యంలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు