భర్త ఇంటి ముందు మహిళ ధర్నా

25 Jan, 2019 12:25 IST|Sakshi
కుమారుడితో ధర్నా చేస్తున్న రమ

చెన్నై, అన్నానగర్‌: భర్తతో కలపాలని కోరుతూ కుమారుడితో సహా మహిళ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. కన్యాకుమారి జిల్లా మార్తాండం విరికోడు ముండవిలై ప్రాంతానికి చెందిన రాజరత్తినం. ఇతని కుమార్తె రమ (24). ఈమెకు మార్తాండం సమీపం కోట్టగం సెంబక్కావిలైకి చెందిన మహేష్‌ (32)తో 2016లో వివాహం జరిగింది. మహేష్‌ విదేశంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన ఏడాదికి దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి.

మహేష్‌ కుటుంబ ఖర్చులకు నగదు ఇవ్వకుండా వచ్చాడు. దీనిపై రమ మార్తాండం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అనంతరం ఇద్దరు కలసి జీవించారు. తరువాత మహేష్‌ పని కోసం విదేశానికి వెళ్లాడు. కుటుంబ ఖర్చులకు నగదు పంపకపోవడంతో రమ పుట్టింటికి చేరుకుంది. ఈ స్థితిలో కొన్ని నెలల కిందట మహేష్‌ స్వగ్రామానికి వచ్చాడు. అయితే భార్యను కలువలేదు. అతనికి తల్లిదండ్రులు మరో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రమ గురువారం భర్తను చూసేందుకు అతని ఇంటికి వెళ్లిది. భర్త, అత్తామామలు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో రమ తన కుమారుడితో భర్త ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగింది. దీనిపై రమ తల్లి మహేశ్వరి మార్తాండం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తెని భర్తతో కలుపాలని కోరింది. ఈ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు