అజిత్,శివకార్తికేయన్ కలయికలో భారీ చిత్రం?

30 Nov, 2015 02:23 IST|Sakshi
అజిత్,శివకార్తికేయన్ కలయికలో భారీ చిత్రం?

 కోలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాల నిర్మాణం పెరుగుతోందని చెప్పవచ్చు. సంచలన దర్శకుడు బాలా ఐదుగురు హీరోలతో భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాగార్జున, కార్తీలతో తోళా అనే మల్టీ స్టారర్ ద్విభాషా చిత్రం నిర్మాణంలో ఉంది.తాజాగా స్టార్ నటుడు అజిత్, యువ నటుడు శివకార్తికేయన్‌ల కాంబినేషన్‌లో భారీ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాచారం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది.
 
  వేదాళం చిత్రం తరువాత అజిత్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అజిత్ మరో మూడు నెలల వరకూ నటనకు దూరంగా ఉంటారని సమాచారం. ఆయన విరామం అనంతరం నటించే చిత్రం గురించి ఒక సంచలన ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.
 
 అజిత్, యువ నటుడు శివకార్తికేయన్ కలిసి నటించనున్నారన్నదే  ప్రచారం. ఇంతకు ముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివనే ఈ మల్టీ స్టారర్ చిత్రానికి స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. శివకార్తికేయన్ నటించిన రజనీమురుగన్ చిత్రం డిసెంబర్ నాలుగున తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఆర్‌డీ.రాజా నిర్మించనున్న నర్సు అక్క(టైటిల్ ఇంకా వెల్లడించలేదు)అనే చిత్రంలో నటిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు