భర్త ప్రియురాలిపై భార్య..!

27 Aug, 2017 09:15 IST|Sakshi
భర్త ప్రియురాలిపై భార్య..!

► చిక్సిత పొందుతూ బాధితురాలి మృతి
► నిందితురాలి అరెస్టు


తిరువళ్లూరు: భర్త ప్రియురాలిపై ఓ మహిళ కిరోసిన్‌ పోసి నిప్పటించింది. ఈ సంఘటనలో బాధితురాలు చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు ప్రాంతానికి చెందిన రాజేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన వైరం అనే వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి సంతోష్, సంజయ్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. వైరం తరచూ ఇంటికి రాకుండా ఉంటుండంతో రాజేశ్వరికి అనుమానం ఏర్పడి విచారించింది. తన భర్తకు వెళ్లవేడులో టీ స్టాల్‌ నిర్వహిస్తున్న అమ్ములుతో వివాహేత సంబంధం ఉన్నట్టు తెలుసుకుంది. వెళ్లవేడు పోలీసులకు, జిల్లా కలెక్టర్‌కు రాజేశ్వరి వినతి పత్రం సమర్పించింది.

అయినా తనకు న్యాయం జరగలేదని పది రోజుల క్రితం రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. పోలీసులు వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంటికి పంపారు. అనంతరం బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లవేడుకు వెళ్లిన రాజేశ్వరికి తన వైరం, అమ్ములు సన్నిహితంగా ఉండడం కనిపించింది. దీంతో ఆగ్రహించిన రాజేశ్వరి టీస్టాల్‌లో ఉన్న కిరోసిన్‌ను తీసుకుని అమ్ములుపై పోసి నిప్పంటించింది. 90 శాతం వరకు కాలిపోయిన అమ్ములును పోలీసులు చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. చిక్సిత పొందుతూ శుక్రవారం అమ్ములు మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.  
 

మరిన్ని వార్తలు