టీ.నగర్: భర్త, పిల్లలను కాదనుకుని వెళ్లిన ఆమె జీవితం దారి తప్పి వ్యభిచార కూపం చేరింది. అక్కడ ఏర్పడిన పరిచయాలే ఆమె ప్రాణం తీశాయి. దాదాపు నెలన్నర క్రితం జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివరాలు కరూర్ జిల్లా ఏమూరు సమీపంలోని నడుపాళయానికి చెందిన ఇళయరాజాకు భార్య పర్వీన్భాను (28), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరి మధ్య విబేధాలు రావడంతో 2015లో పర్వీన్భాను ఇల్లు విడిచి వెళ్లింది. అనేక చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భార్య ఆచూకీ కోసం భర్త పోలీసులను ఆశ్రయించాడు.
గొంతుకు టవల్ బిగించి చంపేశారు..
కరూరు నుంచి చెన్నై చేరుకున్న పర్వీన్భానుకు పెరుంగళత్తూరు బస్టాండులో ఆటో డ్రైవర్ రాజా (30)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో ఉంటూనే వ్యభిచార వృత్తిలో కొనసాగింది. కొన్నాళ్ల తర్వాత రాజాను నుంచి విడిచి ఇరుంబులియూర్ ఏరికరై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మాణిక్కం (28)తో జీవించసాగింది. ఆ తర్వాత మరైమలైనగర్లో కిషోర్తో సహజీవనం చేసింది. గతేడాది నవంబర్ 9వ తేదీన పర్వీన్భాను మరైమలర్ నగర్లో మరో వ్యక్తితో వెళ్లేందుకు సిద్ధమై గుండుమేడుకు చేరుకుంది. మాణిక్కం, రాజా గుండుమేడు ఇంటికి వెళ్లారు. అక్కడ రాజా మిద్దెపై దాక్కొనగా మాణిక్కం ఇంట్లోకి వెళ్లి పర్వీన్భానుతో మద్యం సేవించారు. తనను విడిచి వెళ్లకూడదంటూ మాణిక్కం బెదిరించాడు. మిద్దెపై నున్న రాజా, మాణిక్కం ఇద్దరు కలిసి పర్వీన్భానును గొంతుకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
ముగ్గురు ఆటో డ్రైవర్లే..
మహిళ హత్యకు గురైందనే సమాచారం మేరకు చెన్నై నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన ఆటో డ్రైవర్ పెరుంగళత్తూరుకు చెందిన కిషోర్ (36)ను అదుపులోకి తీసుకుని విచారించగా పర్వీన్ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆటోడ్రైవర్లు మాణిక్కం, రాజా, కిషోర్ను అరెస్టు చేశారు.