క్రిష్ణగిరి: ఏనుగు దాడిలో జీనూరుకు చెందిన సరస్వతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన సూళగిరి వద్ద చోటు చేసుకొంది. వడ్డేనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి మేలుమలై వద్ద క్రాస్ చేసి సూళగిరి సమీపంలోని జీనూరు వద్దకు చేరుకున్నాయి.
ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం వద్దకు వచ్చిన సరస్వతి (45)పై మందలోని ఓ ఏనుగు దాడి చేసి తొండంతో బలంగా విసిరేసి ఘీంకారం చేసింది. ఏదో జరిగిందని స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే సరస్వతి తీవ్ర గాయాలతో సృ్పహ తప్పింది. ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేంద్రన్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అటవీశాఖ అధికార్లు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
వేపనపల్లి వైపు బయల్దేరిన ఏనుగుల మంద
జీనూరు వద్ద మహిళపై దాడి జరిగిన తర్వాత ఏనుగుల మంద వేపనపల్లి వైపు తరలిపోయాయని, మందలో ఐదు పెద్ద ఏనుగులు, రెండు గున్న ఏనుగులు ఉన్నట్లు స్థానికులు చూశారని అటవీశాఖ అధికారులు తెలిపారు.