పరిమళించిన మానవత్వం

30 Apr, 2020 12:57 IST|Sakshi
వృద్ధురాలికి అరటిపండు ముద్దగా చేసి తినబెడుతున్న ఎస్‌.ఐ శుభశ్రీ నాయక్‌

వృద్ధురాలి ఆకలి తీర్చిన మహిళా ఎస్‌.ఐ

మెడికల్‌ కూడలి వద్ద ఘటన

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో విధుల నిర్వహణలో ఉంటుండగా ఓ మహిళాఎస్‌.ఐ (సబ్‌ఇన్‌స్పెక్టర్‌) అక్కడి వృద్ధురాలి ఆకలి తీర్చి మానవీయతను ప్రదర్శించింది. ఇదే సంఘటనను చూసిన అక్కడి సిబ్బంది, స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు. అసలే ఓ వైపు కరోనా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే దీని నుంచి రక్షణ పొందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ కారణంగా ఎంతో మంది పేదలు తినడానికి తిండి దొరకక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నో రోజుల పాటు పస్తులతో దుర్భర జీవితాలు గడిపిన వారు మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్లు, అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల పరిస్థితి ఊహించుకుంటే దారుణం.

ఇదే తరహాలో మెడికల్‌ కూడలి వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శుభశ్రీ నాయక్‌కు అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధురాలు కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడి బోరు వద్దకు నీరు తాగేందుకు ఆ వృద్ధురాలు పాకుకుంటూ వెళ్లడాన్ని ఆ ఎస్‌.ఐ గమనించారు. దీంతో ఆమె వద్దకు వెళ్లి, వివరాలు ఆరా తీశారు. ఆ వృద్ధురాలికి ఎవరూ లేరని తెలియడంతో ఆ వృద్ధురాలిని ఓ చోట కూర్చోబెట్టిన ఎస్‌.ఐ, దగ్గరలోని దుకాణానికి వెళ్లి, అరటిపండ్లు కొనుక్కొని తీసుకువచ్చింది. ఆమెకు ఇస్తుండగా ఆ పండ్లు తీసుకునేందుకు కూడా ఆ వృద్ధురాలి చేతులు సహకరించకపోవడంతో జాలిపడిన ఎస్‌.ఐ స్వయంగా తినిపించి, ఆ తర్వాత డ్రింక్‌ తాగిపించింది. అనంతరం ఆ వృద్ధురాలి ముఖం, చేతులు శుభ్రంగా నీటితో కడిగి, ముఖానికి మాస్క్‌ కట్టి మరీ అక్కడి నుంచి ఆ ఎస్‌.ఐ వెనుదిరగడం విశేషం.

మరిన్ని వార్తలు