⇔ మహిళా వార్
⇔ వేదికగా సత్యమూర్తి భవన్
⇔ జాతీయ, రాష్ట్ర కార్యదర్శి ముష్టియుద్ధం
⇔ నేతల విస్మయం
⇔ రంగంలోకి పోలీసులు
⇔ రాష్ట్ర అధ్యక్షుడి విచారణ
⇔ ఢిల్లీకి పంచాయితీ
సాక్షి, చెన్నై: పురుషులకు తామేమీ తీసిపోమన్నట్టుగా మహిళా కాంగ్రెస్ నిర్వాహకులు కొట్టుకున్నారు. జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు ముష్టియుద్ధానికి దిగారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్ వేదికగా బుధవారం సాగిన ఈ వార్ అక్కడున్న నేతల్ని విస్మయంలో పడేసింది. రాష్ట్ర కాంగ్రెస్లో గ్రూపులకు కొదవలేదన్న విషయం తెలిసిందే. పార్టీలోనే కాదు, అనుబంధ విభాగాల్లోనూ ఈ ప్రభావం ఎక్కువే. ఇటీవల కాలంగా మహిళా కాంగ్రెస్లో రోజుకో వివాదం సాగుతోంది.
రెండు రోజుల క్రితం చెన్నైలో పర్యటించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పార్టీ నేతలకు, అనుబంధ విభాగాలకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు. గ్రూపులు వీడాలని, ఐక్యతతో ముందుకు సాగాలని హిత బోధ చేశారు. అయినా, తామింతే అని చాటుకునే పనిలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా పురుషులకు తామేమి తీసి పోమన్నట్టుగా మహిళా నాయకులు కొట్టుకోవడం చర్చకు దారి తీసింది. అయితే, ఈ గొడవకు అసలు కారణం, రాహుల్గాంధీ పర్యటన కావడం గమనార్హం.
కొట్టుకున్నారు..
రెండు రోజుల క్రితం రాహుల్ చెన్నైకు వచ్చిన క్రమంలో మహిళా కాంగ్రెస్ తరఫున సత్యమూర్తి భవన్ వద్ద ఆహ్వాన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. తిరువళ్లూరు జిల్లాకు చెందిన మహిళా నేత గౌరి గోపాల్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మహిళా విభాగం జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ పేరు, ఫొటో గల్లంతు అయింది. ఇందుకు హసీనా కక్ష కట్టినట్టున్నారు.
గౌరి గోపాల్ను పదవి నుంచి తొలగించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, బుధవారం ఉదయం సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ నోరు జారారు. తనను విస్మరిస్తే, ఏమి జరిగిందో చూశారుగా అంటూ పరోక్షంగా గౌరి గోపాల్ తొలగింపును ఉద్దేశించి స్పందించడం వివాదానికి దారి తీసింది.
గౌరి గోపాల్కు మద్దతుగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీరాణి స్పందించడంతో వాగ్వివాదం బయలుదేరింది. అదే సమయంలో అక్కడే ఉన్న గౌరి గోపాల్ మద్దతు దారులు హసీనా సయ్యద్పై తిరగబడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హసీనా సయ్యద్, ఝాన్సీరాణి ముష్టియుద్ధానికి దిగడంతో వారిని వారించేందుకు వారి భర్తలు రంగంలోకి దిగారు.
ఈ సమయంలో హసీనా సయ్యద్ భర్త ఉమర్ను టార్గెట్ చేసిన గౌరి గోపాల్, ఝాన్సీ రాణి చేయిచేసుకోవడంతో ఉద్రిక్తతం చోటు చేసుకుంది. హసీనా, ఉమర్లను సమావేశ మందిరం నుంచి తరిమి తరిమి కొట్టడంతో బయటకు పరుగులు తీశారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ మహిళా వార్తో అక్కడున్న పార్టీ వర్గాలు విస్మయంలో పడ్డారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి.
భద్రత నడుమ హసీనా సయ్యద్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. తన మీద పనిగట్టుకుని దాడి చేశారంటూ ఢిల్లీకి ఫిర్యాదు చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమక్షంలో ఈ గొడవ తొలుత సాగినట్టు సమాచారం. ఆయన తప్పుకోవడంతో మహిళలు మరింతగా రెచ్చిపోవడంతో వివాదం రచ్చకెక్కిందని సత్యమూర్తి భవన్ వర్గాల్లో చర్చ. ఇక, ఈ ఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటానని తిరునావుక్కరసర్ పేర్కొన్నారు.