ఆలయంలో అర్ధరాత్రి యాగం

12 Dec, 2016 15:09 IST|Sakshi

ఆగమశాస్త్ర విరుద్ధంగా నిర్వహణ
అమ్మ క్షేమం కోసం యాగం చేసినట్టు సమాచారం
దేశానికే అరిష్టం : దీక్షితులు

టీనగర్: ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చెన్నై, పార్థసారధి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి యాగం నిర్వహించడంతో సంచలనం ఏర్పడింది. ఇది దేశానికే అరిష్టమని దీక్షితులు వ్యాఖ్యానించడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ట్రిప్లికేన్‌లోని పార్థసారధి ఆలయం 108 వైష్ణవ క్షేత్రాల్లో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం హిందూ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే గాకుండా ఇతర రాష్ట్రాలకు చెంది న భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో ఉదయం 6 గంటలకు సన్నిథిని తెరిచి రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు. ఈ సమయంలోనే ఆలయంలో ఐదు కాలపూజలు జరుపుతుంటారు. ఇదే సమయంలో మిగతా యాగపూజలు, అది కూడా మంచి సమయం చూసి జరపాలన్నది ఆగమ శాస్త్ర విధిగా ఉంది. అరుుతే ఆలయం మూసివేసిన తర్వాత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయ సన్నిథిని తెరిచారు.

ఆలయ డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మి, అడిషనల్ కమిషనర్ కవిత, ఓ  జ్యోతిష్యుడు, కొందరు వేద పండితులు ఆలయ సన్నిథి చిన్న ద్వారం తెరచి యాగశాల పూజలు నిర్వహించారు. ఆలయంలో పనిచేసే దీక్షితులు వ్యతిరేకత తెలుపుతారనే కారణంగా బయటి నుంచి తీసుకువచ్చిన వేదపండితుల ద్వారా యాగశాల పూజ జరిగింది. ముఖ్యమంత్రి క్షేమాన్ని కోరుతూ ఈ యాగం నిర్వహించినట్లు తెలిసింది. ఇందుకోసం అనేక మంది వీఐపీలు కార్లలో ఈ ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి మూడు గంటల వరకు యాగపూజ కొనసాగింది.

ఆగమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఉన్నత పదవుల్లో వున్న వారికి ప్రమాదం కలిగించడమే గాకుండా దేశానికే అరిష్టం కలుగుతుందని దీక్షితులు వ్యాఖ్యానించారు. ఆగమ నిబంధనలు మీరితే అందరికీ ఇబ్బందులు కలుగుతాయన్నారు. శ్రీరంగం ఆలయంలో సమయాన్ని పాటించకుండా కుంభాభిషేకం నిర్వహించడంతో ప్రస్తుతం పాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఆగమ శాస్త్ర నిబంధనలు మీరితే ఏమి జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అరుున ప్పటికీ అర్థరాత్రి ఆలయ ప్రవేశం చట్ట విరుద్ధమని, అటువంటి స్థితిలో ఆలయాన్ని తెరచి పూజలు నిర్వహించడం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు