మిస్టర్ అండ్ మిసెస్ యశ్

12 Aug, 2016 11:20 IST|Sakshi
మిస్టర్ అండ్ మిసెస్ యశ్

ఐదేళ్ల ప్రేమకు శుభం కార్డు
నేడు గోవాలో యశ్, రాధికా పండిట్‌ల నిశ్చితార్థం
డిసెంబర్‌లో వివాహం!
 
 బెంగళూరు: నందగోకుల సీరియల్‌తో బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన వారిద్దరూ ఆ తర్వాత ‘మొగ్గిన మనసు’తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆ ఇద్దరు కళాకారులు తమదైన శైలిలో శాండల్‌వుడ్‌లో అగ్రశ్రేణి హీరో, హీరోయిన్‌లుగా పేరు తెచ్చుకున్నారు. వారే యశ్, రాధికా పండిట్.  మొగ్గిన మనసు, డ్రామా, మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి తదితర చిత్రాలతో హిట్‌పెయిర్‌గా పేరుగాంచిన యశ్,రాధికా పండిట్‌లు త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.

ఐదు సంవత్సరాలుగా యశ్,రాధికాపండిట్‌లు ప్రేమించుకుంటున్నారని వస్తున్న వార్తలపై ఇరువురి తరపున మౌనమే సమాధానమైంది. దీంతో ఇది కేవలం ఊహాగానాలు అనుకుంటున్న సమయంలో శుక్రవారం ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మధ్య గోవాలో యశ్,రాధికా పండిట్‌ల నిశ్చితార్థం వార్తలతో శాండల్‌ఉడ్‌తో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేసారు. గోవాలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో యశ్, రాధికా పండిట్‌ల నిశ్చితార్థం జరగనుంది.


ఈ నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు గాను శాండల్‌వుడ్ ప్రముఖులు రవిచంద్రన్, కె.మంజు తదితరులు గురువారం బయలు దేరి వెళ్లారు. కాగా, యశ్,రాధికా పండిట్‌ల వివాహం డిసెంబర్‌లో బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో అత్యంత వైభవోపేతంగా జరుగనుందని సమాచారం.

మూడు రోజుల పాటు జరుగనున్న యశ్,రాధికాల వివాహానికి సినీ,రాజకీయ ప్రముఖుల సమక్షంలో మొదటి రోజు మాంగల్యధారణ, రెండవ రోజు వివాహానికి హాజరైన అతిథులకు విందు ఏర్పాటు చేయనుండగా, మూడవ రోజు అభిమానులకు విందు కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నుట్ల సమాచారం. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్‌లైఫ్‌లో కూడా యశ్,రాధికా పండిట్‌లు హిట్‌పెయిర్‌గా నిలవాలని ఇరువురి అభిమానులో పాటు, శాండల్‌ఉడ్ కూడా కోరుకుంటోంది. 

మరిన్ని వార్తలు