ప్రాణాల మీదకు తెచ్చిన టిక్‌టాక్‌

15 May, 2020 09:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: టిక్‌టాక్‌ మోజులో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. టిక్‌టాక్‌ వీడియో చిత్రీకరిస్తూ ఒక యువకుడు కరెంట్‌ షాక్‌తో గాయపడ్డాడు. 22 ఏళ్ల యువకుడు కదులుతున్న గూడ్స్‌ రైలుపై నిలబడి టిక్‌టాక్‌ వీడియో చిత్రీకరిస్తుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో యువకుడికి 20 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనలో అతడి ప్రాణానికి ప్రమాదం తప్పిందని తెలిసింది. ('అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా')

మైసూర్‌ నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు మెజెస్టిక్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో నెమ్మదిగా నడుస్తున్న గూడ్స్‌ రైలుపై టిక్‌టాక్‌ వీడియో చేసేందుకు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. వీడియో తీసుకునే సమయంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌ తగిలి కిందపడిపోయాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు ఆ యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడినిక ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ యువత ప్రాణాలకు మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. అధికారులు, అయినవారు చెబుతున్నా వినకుండా యువత టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. (ప్రధాని ప్రసంగం అయిపోగానే.. తెగ వెతికారు!)

Poll
Loading...
మరిన్ని వార్తలు