సర్కారే కాటేస్తోంది!

22 Nov, 2016 08:27 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లాలో దివీస్‌ బాధితులపై పోలీసుల దౌర్జన్యం (ఫైల్‌)

13 గ్రామాలు, 25 వేల జనాభాకు తీవ్ర నష్టం
బాధితులతో నేడు వైఎస్‌ జగన్‌ ముఖాముఖి


సాక్షి ప్రతినిధి, కాకినాడ: దివీస్‌ రసాయనాల పరిశ్రమ వల్ల 13 గ్రామాల్లో 25 వేల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఆ పరిశ్రమకు కొమ్ముకాస్తుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగిసిపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలోని తొండంగి మండలం దానవాయిపేట వద్ద దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమను స్థాపిస్తున్నారు. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 20 వేల మంది రోడ్డున పడుతున్నా.. ఏటా రూ.16 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం నష్టపోతున్నా, గాలికొదిలేసిన సర్కారు.. స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది.

తీర ప్రాంతంలో సరుగుడు, జీడిమామిడి సాగు చేసేందుకు పేద రైతులకు పట్టాలుగా ఇచ్చిన దాదాపు 505 ఎకరాల భూమిని దివీస్‌ రసాయనాల పరిశ్రమ కోసం ప్రభుత్వం కేటాయించింది. భూ సేకరణ చట్టాన్ని సైతం ఉల్లంఘించి రూ.35 లక్షలకు పైబడి ఉన్న మార్కెట్‌ ధరను పక్కన పెట్టి, కేవలం రూ.5 లక్షలు రైతులకు పరిహారంగా ఇచ్చి పేదల పొట్టకొడుతోంది. ఎస్‌ఈజెడ్‌ పేరుతో సేకరించిన పదివేల ఎకరాల్లో సింహభాగం ఇప్పటికీ అదే ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్నా దానిని పక్కన పెట్టి కొత్తగా అతితక్కువ ధరకు భూములను సేకరించిన తీరుతోనే వివాదం రాజుకుంది.

హేచరీల మనుగడ ప్రశ్నార్థకం...
దివీస్‌ పరిశ్రమ వల్ల ఓ వైపు రైతాంగం తీవ్రంగా నష్టపోతే అదే ప్రాంతంలో దాదాపు 250కి పైగా ఉన్న హేచరీల మనుగడ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఆక్వా జోన్‌గా ఉన్న ఈ ప్రాంతంలో దివీస్‌ వల్ల సముద్ర జలాలు కలుషితమై హేచరీలు మూతపడే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. దేశంలోని ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలతోపాటు ఇతర జిల్లాలకు కూడా 60 శాతం రొయ్య పిల్లలు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్న పరిస్థితుల్లో దివీస్‌ వల్ల ఇక ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బేనంటున్నారు. మరో వైపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 ఏళ్లుగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది.   

రసాయనాలతో ముప్పు  
దివీస్‌ పరిశ్రమకు వినియోగించే అనేక రకాల రసాయనాలు, వాటి ద్వారా వచ్చే వ్యర్థాలు, విడుదలయ్యే విషవాయువుల వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి కాలుష్యం వల్ల తీర గ్రామాల్లోని 10 వేల మందికిపైగా మత్స్యకారులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ కారణంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిన ముప్పు ముంచుకొస్తోంది.

ఎగిసిపడ్డ ఉద్యమం..
దివీస్‌ పరిశ్రమ వల్ల ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తోపాటు వామపక్ష పార్టీల ఆందోళనతో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం ఆందోళనకారులపై విరుచుకు పడుతోంది.   ప్రజలకు భరోసాగా నిలిచిన నాయకులపై కేసులు పెట్టి, లాఠీలు ఝుళిపిస్తూ ఉక్కుపాదం మోపుతోంది. దాదాపు 80 రోజులుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజల గొంతునొక్కి.. పోలీసులు, ప్రైవేటు సైన్యం సహాయంతో కర్కశంగా వ్యవహరిస్తున్నా బాధితులు మాత్రం మొక్కవోని దీక్షతో కదంతొక్కుతున్నారు.

బాధిత గ్రామాల్లో 4 వేల మం దికి పైగా పోలీసులు మోహరించి అన్ని రోడ్లలో చెక్‌ పోస్టు లు ఏర్పాటు చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు అనేక మం ది వామపక్షాల నేతలు ప్రజల పక్షాన నిలబడి పోలీసుల దౌర్జన్యాలను, ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాపై 307తోపాటు 22 కేసులు నమోదు చేసింది. ఈ దివీస్‌ పరిశ్రమ వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఉండడం వల్లే ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నేడు దానవాయిపేటలో వైఎస్‌ జగన్‌ పర్యటన
సాక్షి, హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం సందర్శించనున్నారు. దివీస్‌ పరిశ్రమ స్థాపన వల్ల నష్టపోనున్న బాధిత ప్రజలతో మధ్యాహ్నం తర్వాత ముఖాముఖి మాట్లాడతారని, బహిరంగ సభలో వారినుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

వేలాది మంది కడుపుకొట్టే అభివృద్ధి ఎందుకు?
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజం


తొండంగి: ఆక్వా కల్చర్‌ ద్వారా అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం లభించడానికి కారణమైన తీర ప్రాంత రైతులు, పరిసర గ్రామాల ప్రజలకు నష్టం చేకూర్చే కాలుష్య కంపెనీలతో చేసే అభివృద్ధి ఎందుకని వైఎస్సార్‌సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని బంగాళాఖాతం తీర ప్రాంతంలో  ఆక్వా హేచరీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సీఏఏ ప్రమాణాలకు అనుగుణంగా హేచరీల ద్వారా 60 శాతం నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ఇలాంటి చోట కాలుష్య దివీస్‌ పరిశ్రమను పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచక పరిస్ధితులను సృష్టిస్తున్నారన్నారు.

జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ దత్తత తీసుకున్న దానవాయిపేట పంచాయతీలో చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ఫండ్‌ ఇచ్చిన కాంట్రాక్టర్లకు రూ.300 కోట్ల విలువైన భూమిని పాతిక కోట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తీరంలో పోలీసుల దమనకాండకు అంతు లేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఉద్యమానికి మద్దతు పలికిన వివిధ పార్టీల నేతలను పోలీసులు బూటుకాళ్లతో తన్నిస్తున్నారన్నారు. తాము అభివృద్ధికి అడ్డుపడమని, ప్రజలకు నష్టం చేకూర్చే కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకమన్నారు.

మరిన్ని వార్తలు