ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు మాటమార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నోట్ల రద్దును తొలుత స్వాగతించిన చంద్రబాబు ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నారన్నారు.
నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జైట్లీని కోరినట్లు ఎంపీ వైవీ చెప్పారు. రైతులు పంటలను అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సహకార బ్యాంకుల్లో రైతులకు పాతనోట్లతో అప్పులు చెల్లించేలా అవకాశం కల్పించడంతో పాటు అత్యవసర సేవలన్నింటికీ పాత నోట్లను అనుమతించాలన్నారు. పార్లమెంట్ను స్తంభింపచేయడాన్ని కాంగ్రెస్ పార్టీ విరమించుకోవాలని ఆయన సూచించారు. నోట్ల రద్దుపై ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. పార్లమెంట్లో ఈ అంశంపై లోతుగా చర్చించాలని చెప్పారు. నల్లధనం వెలికితీసే అన్ని చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుంటుందని ఎంపీ వైవీ స్పష్టం చేశారు.