మహిళా దినోత్సవం నాడు ఇంత దారుణమా?

8 Mar, 2018 12:22 IST|Sakshi

గర్భిణి మృతి ఘటనపై నటి గౌతమి దిగ్భ్రాంతి

జయలలిత సమాధి వద్ద నివాళులు.. ఆవేదన

సాక్షి, చెన్నై : ఓ వైపు ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసుల దాష్టికానికి ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడును దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రముఖ నటి గౌతమి గురువారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు. గర్భిణీ మృతి ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచ్చిలో పోలీసుల తీరుతో నిండు గర్భిణి మృతి చెందడం తనను కలిచి వేసిందని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం రోజునే ఇలాంటి దారుణం జరగడం సమాజానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుచ్చిలోని గణేష్‌ సర్కిల్‌ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్‌ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు.  బైక్‌ వెనుక కూర్చున్న ఇన్స్‌పెక్టర్‌ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్‌పెక్టర్‌ కాలు గర్భిణీ పొట్టపై బలంగా తాకడంతో దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి.
 

మరిన్ని వార్తలు