డౌన్‌పేమెంట్‌ కట్టి ప్రేయసిని దక్కించుకున్నాడు!

6 Nov, 2017 03:21 IST|Sakshi

ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి..

ప్రేయసి భర్తకు రూ.25 వేలు చెల్లించిన ప్రియుడు

తమిళనాడు మనప్పారైలో ఘటన

పెరంబూరు (చెన్నై): ప్రేమించిన యువతికి వివాహమైనా ఆమె భర్తను ఒప్పించి ప్రేయసిని దక్కించుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులో ఆదివారం చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీప ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు దేవికి మేనమామతో ఇష్టంలేని వివాహం జరిపించారు. అయితే మామతో జీవించలేని దేవి.. ప్రియుడితో రెండుమార్లు వెళ్లింది. తల్లిదండ్రులు దేవిని తిరిగి తీసుకువచ్చి భర్తతో కలిపారు.

ఇటీవల మళ్లీ ప్రియుడి వద్దకు వెళ్లిన దేవిని తిరిగి తీసుకువచ్చిన మనప్పారై పోలీసులు.. ఆమెను విచారించారు. భర్తతో కాపురం చేయనని ఆమె తేల్చి చెప్పింది. వివాహం జరిగిన తర్వాత ఆమెను ఎంఈ చదివించినందుకు రూ.లక్ష ఖర్చు అయినట్టు భర్త తెలిపాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా మనప్పారై పోలీసుల నేతృత్వంలో జరిగిన చర్చల ఫలితంగా రూ.లక్షను దేవి భర్తకు విడతలవారీగా ఇవ్వడానికి  ప్రియుడు ముందుకొచ్చాడు. తొలి విడతగా రూ.25 వేలు ఇచ్చి ఆదివారం దేవిని తనతో తీసుకెళ్లాడు.

మరిన్ని వార్తలు