కీర్తి సురేశ్‌ సందడి.. అభిమానుల తొక్కిసలాట

28 Oct, 2018 19:27 IST|Sakshi

సాక్షి, చెన్నై : మహానటి ఫేం కీర్తి సురేశ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తమిళనాడు, వేలూరు జిల్లా తిరపత్తూరులో చోటుచేసుకుంది. ఆదివారం ఏవీఆర్‌ నగల షాపు ప్రారంభానికి అతిథిగా వచ్చిన కీర్తి సురేశ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్‌ కారును చూసిన అభిమానులు ఆమెను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు.

దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. వారందరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తమ అభిమాన నటిని చూసేందుకు వస్తే లాఠీచార్జ్‌ చేస్తారా? అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నగల షాపును ప్రారంభించిన కీర్తీ సురేశ్‌ కొద్దిసేపు అక్కడ ఆడిపాడి సెల్ఫీలతో అభిమానులను అలరించారు.

మరిన్ని వార్తలు