కోటి ఇచ్చినా అలా చేయను

9 May, 2018 08:57 IST|Sakshi

తమిళసినిమా : కోటి రూపాయిలిచ్చినా ఆ పని మాత్రం చేయను అంటోంది నటి నిత్యామీనన్‌. ఈ అమ్మడు ఇతర నటీమణులకు కాస్త డిఫెరెంట్‌ అనే చెప్పాలి. 2005 నుంచి సినిమా రంగంలో కొనసాగుతున్న నటి నిత్యామీనన్‌. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ కథానాయకిగా తన పరిధిని విస్తరించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ప్రవర్తనను చూసి కొందరు పొగరుబోతు అని కూడా అంటుంటారు. 180 చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయం అయిన నిత్యామీనన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం 2015లో మణిరత్నం దర్శకత్వంలో నటించిన కాదల్‌ కణ్మణి చిత్రమే. ఆ చిత్రంతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తరువాత విక్రమ్‌కు జంటగా ఇరుముగన్, సూర్యతో 24, విజయ్‌ సరసన మెర్శల్‌ వంటి చిత్రాల్లో నటించింది.

మెర్శల్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించినా కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ తరువాత నిత్యామీనన్‌ కోలీవుడ్‌లో మరో చిత్రంలో నటించలేదు. కారణాలేమిటంటే ఈ అమ్మడు ఏ అవకాశాన్నీ ఒక పట్టాన అంగీకరించదని, పలు కండిషన్స్‌ పెడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిత్యామీనన్‌ ఇచ్చిన ఒక భేటీలోనూ ఇదే విషయాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఏం చెప్పిందో చూద్దాం. పారితోషికం ఎంత ఇచ్చినా మహిళలను కించపరచే పాత్రల్లోనూ, పక్కా వ్యాపార దృక్పథంతో కూడిన పాత్రల్లో నటించడానికి నేను అంగీకరించను. అంతే కాదు నేను కథలను ఎంపిక చేసుకునే విధానం డిఫెరెంట్‌గా ఉంటుంది. కథ సామాజానికి పనికొచ్చేదిగా ఉందా, లేదా అందులో నేను నటిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? లాంటి పలు విధాలుగా ఆలోచిస్తాను. ఇక కథ నచ్చితే అందులో నా పాత్ర ప్రాముఖ్యత ఎంత అన్న విషయం పట్టించుకోను అని అన్న నిత్యామీనన్‌ ఈ మధ్య తెలుగులో ‘అ’ అనే చిత్రంలో లెస్బియన్‌ పాత్రలో నటించడానికి వెనుకాడలేదన్నది గమనార్హం. 

మరిన్ని వార్తలు