కుల, జాతి సంఘాల వ్యక్తులపై నిషేధం : రజనీకాంత్‌

28 Aug, 2018 17:47 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో సరికొత్త పంథాను ఎంచుకున్నారు. రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముందుగానే సభ్యత్వాల నమోదు చేయించాలని రజనీకాంత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే రజనీకి సంబంధించిన పార్టీ సభ్యత్వాల సంఖ్య కోటి దాటిపోవడం విశేషం. అయితే మక్కల్‌ మండ్రం విధివిధానాలతో కూడిన 32 పేజీల పుస్తకాన్ని రజనీకాంత్‌ మంగళవారం విడుదల చేశారు. దీనిలో కుల, మత, వారసత్వరాజకీయాలకు చోటులేదని స్పష్టం చేశారు.

ఒకే కుటుంబానికి ఒకే పదవి అని మక్కల్‌ మండ్రం విధివిధానాల్లో పేర్కొన్నారు. ఏదైనా కుల, జాతి సంఘాల్లోని వ్యక్తులకు రజనీ మక్కల్‌ మండ్రంలో నిషేధం విధించారు. అంతేకాకుండా మక్కల్‌ మండ్రం జెండాను కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదని ఆంక్షలు విధించారు. కేవలం సమావేశాలున్న సమయాల్లో మాత్రమే వాడాలని సూచించారు. మక్కల్‌ మండ్రం గురించి పబ్లిక్‌లో ఎవరూ మాట్లాడరాదని ఆంక్షలు విధించారు.

మరిన్ని వార్తలు