అలా చేయడం తప్పే అవుతుంది : విజయ్‌ సేతుపతి

12 Aug, 2019 20:25 IST|Sakshi

ఎన్డీయేపై విమర్శలు చేసిన తమిళ నటుడు

కశ్మీర్‌ ప్రజల అభిప్రాయాన్ని పరిగణించరా అని ప్రశ్న

చెన్నై : కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని కోలీవుడ్‌ స్టార్‌హీరో విజయ్‌ సేతుపతి తప్పుబట్టారు. బీజేపీ తీరు సరిగా లేదని విమర్శించారు. కశ్మీర్‌ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అంతపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ‘ఎస్‌బీఎస్‌ తమిళ్‌’ అనే రేడియా చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్డీయే ప్రభుత్వం నడుచుకుంది. ఎవరి సమస్యలేంటో, వివాదాలేంటో వారినే తేల్చుకోనీయండని ద్రవిడ ఉద్యమ నిర్మాత పెరియార్‌ చెప్తుండేవారు.

మీ ఇంటి సమస్యల్లో తలదూర్చడానికి నేనెవరినీ..? అక్కడ బతికేది నువ్వు. నీకు సంబంధించిన వ్యవహారాలు వినడం వరకే నా పని. కానీ, నా నిర్ణయాన్ని నీపై రుద్దాలనుకోవడం సరైంది కాదు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది’అన్నారు. కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాలు తనకు బాధ కలిగించాయని చెప్పారు. ‘కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వరకే మనపని. వారికి మనం ఎలాంటి సలహాలు ఇవ్వలేం. మన అభిప్రాయాల్ని వారరిపై రుద్దడం తప్పే అవుతుంది’అని పునరుద్ఘాటించారు. మెల్‌బోర్న్‌లో గతవారం జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పాల్గొనేందుకు విజయ్‌ వెళ్లారు. ఇక ఆర్టికల్‌ 370 రద్దుపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం భారత్‌కు, కశ్మీరీ ప్రజలకు శుభపరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కృష్ణార్జునులు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 

మరిన్ని వార్తలు