సాక్షి, అన్నానగర్: ఏనుగు దాడిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తమిళనాడులోని దిండుగల్ జిల్లా తాండిక్కుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. తాండిక్కుడి కరుప్పుస్వామి ఆలయ వీధికి చెందిన కన్నన్ భార్య మూగమ్మాళ్(56) కూలీ. ఈమె సమీపంలోని పెరుంగాణల్ ప్రాంతంలో ఉన్న తేయాకు తోటలో మంగళవారం మధ్యాహ్నం పనిచేస్తున్నది. ఆ సమయంలో ఓ అడవి ఏనుగు తోటలోకి జొరబడింది. దాన్ని చూసి మూగమ్మాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఏనుగు ఆమెని వెంబడించి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. వత్తలక్కుండు అటవీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు. ఆమె మృతదేహాన్ని రైతులు తాండిక్కుడి-వత్తలకుండు రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. ఏనుగుల నుంచి తమను రక్షించాలని, ధ్వంసమైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.