సైబర్ క్రైమ్ ఎఫెక్ట్: 500 యాప్స్ గోవిందా!

23 Aug, 2017 17:45 IST|Sakshi
సైబర్ క్రైమ్ ఎఫెక్ట్: 500 యాప్స్ గోవిందా!

వాషింగ్టన్: ఇటీవల సాంకేతిక ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై సైబర్ అటాక్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ అవుతుందన్న కారణంతో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఏకంగా 500 అప్లికేషన్లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అమెరికాకు చెందిన సాంకేతిక (సైబర్) నిపుణుల సూచన మేరకు గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

వన్నాక్రై సైబర్ దాడితో 41 యాప్స్ లో వైరస్ ఉన్నట్లు గతంలో గుర్తించారు. కానీ అది అంతటితో ఆగకుండా 500కు పైగా ప్లే స్టోర్ అప్లికేషన్లకు వ్యాప్తి చెందిందనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్న ఈ యాప్స్ ద్వారా వైరస్ లు వ్యాప్తి చెంది నెటిజన్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేసి హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. గూగుల్ తొలగించిన అప్లికేషన్లలో మొబైల్ గేమ్స్, ఆన్ లైన్ రేడియో, ఫొటో ఎడిటింగ్, ఆరోగ్యం, వాతావరణం, వీడియో కెమెరా యాప్స్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

'ఐజెక్సిన్' (Igexin) అనే సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కిట్ (ఎస్‌డీకే) ను అప్లికేషన్లలో ఎంబాడ్ చేయడంతో వైరస్ సోకిన ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు ప్రభావితమైన అనంతరం నకిలీ యాడ్ ను క్రియేట్ చేస్తూ హ్యాకర్లు డబ్బులు గుంజడానికి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అయితే కొన్ని సంస్థల కోడింగ్ డెవలపర్లకు యాప్స్‌లో వైరస్ వ్యాప్తి చెందుతోన్న విషయం తెలియకపోవటం గమనార్హం. 

మరిన్ని వార్తలు