జియో ఫోన్‌ బుక్‌ చేసుకోండిలా..

26 Jul, 2017 18:59 IST|Sakshi
జియో ఫోన్‌ బుక్‌ చేసుకోండిలా..
హైదరాబాద్‌ : మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న జియో ఫోన్‌ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో ఫీచర్‌ ఫోన్‌ హ్యాండ్‌సెంట్లకు కొత్త ఊపిరినిచ్చే జియో ఫోన్‌ ఫ్రీ-బుకింగ్‌లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీనే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. ఈ విషయంపై రిలయన్స్‌ జియో క్లారిటీ ఇచ్చింది. జియో ఫోన్‌ బుకింగ్‌ను వినియోగదారులు మై జియో యాప్‌ ద్వారా కానీ, ఆన్‌లైన్‌లో కానీ, రిలయన్స్‌ జియో రిటైల్‌ స్టోర్ల ద్వారా కానీ బుక్‌ చేసుకోవచ్చని బుధవారం చెప్పింది.
 
రూ.1500 రీఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు సెప్టెంబర్‌ నుంచి జియో ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జియో ఫోన్‌పై మరిన్ని తాజా అప్‌డేట్ల కోసం www.jio.com వెబ్‌సైట్లను సందర్శించాలని పేర్కొంది. అయితే జియో ఫోన్‌పై మార్కెట్‌లో ఉ‍న్న అమితాసక్తిని దృష్టిలో పెట్టుకుని కొన్ని అనధికారిక వెబ్‌సైట్లు, రిటైల్‌ సంస్థలు, అడ్వాన్స్‌ బుకింగ్‌ల పేరిట పాల్పడే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది.  
మరిన్ని వార్తలు