షాకింగ్‌: జియో ఫోన్‌ బుకింగ్స్‌ క్లోజ్‌

26 Aug, 2017 14:22 IST|Sakshi
షాకింగ్‌: జియో ఫోన్‌ బుకింగ్స్‌ క్లోజ్‌
సాక్షి, ముంబై: రిలయన్స్‌ జియో ఫోన్‌కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఆగస్టు 24వ తేదీ ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్‌సైట్‌ క్రాష్‌ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే ఈ ఫోన్‌ 30 లక్షల మార్కును క్రాస్‌ చేసింది కూడా. అయితే ప్రస్తుతం జియో ఫోన్‌ బుకింగ్స్‌ను ఆ కంపెనీ నిలిపివేసినట్టు తెలిసింది. జియో సైట్‌లో ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నామని జియో ఫోన్‌ కావాలనుకునే వారు కేవలం ఇప్పుడు తమ ఆసక్తిని మాత్రమే రిజిస్ట్రర్‌ చేసుకోడంటూ రిలయన్స్‌ పేర్కొంది. ప్రీ-బుకింగ్స్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామో తర్వాత తెలుపుతామంటూ జియో సైట్‌లో తెలిపింది. తాత్కాలికంగా అయితే బుకింగ్‌ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది.
 
'' థాంక్యూ ఇండియా! లక్షల మంది జియో ఫోన్‌ను బుక్‌ చేసుకున్నారు'' అని జియో.కామ్‌ హోమ్‌ పేజీలో కంపెనీ బ్యానర్‌గా ఈ విషయాన్ని తెలిపింది. జియో అకస్మాత్తుగా ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేయడంతో, తర్వాత బుక్‌ చేసుకోవచ్చని భావించిన ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. జియో 4G ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమై, 26వ తేదీ ఉదయం వరకు కొనసాగాయి. అంటే 36 గంటలు మాత్రమే ఈ బుకింగ్స్‌కు అనుమతి ఇచ్చింది. మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే కోటి ఫోన్లు బుక్‌ అయినట్టు తెలుస్తోంది. జియో ఫోన్‌ను ఇప్పుడు బుక్‌ చేసుకున్న వారికి సెప్టెంబర్‌లో అందిస్తారు. అయితే సెప్టెంబర్‌లో ఏ తేదీని ఫోన్ల డెలివరీ ఉంటుంది, ఏ స్టోర్‌లో ఈ ఫోన్‌ను కలెక్ట్‌ చేసుకోవచ్చో తెలుపుతూ కంపెనీ మెసేజ్‌ పంపనుంది.
మరిన్ని వార్తలు