వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు వేతనం

8 Apr, 2020 03:37 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల సిబ్బందికి నగదు ప్రోత్సాహకం

ఉత్తర్వులు విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: విపత్కర సమయంలో చెమటోడ్చి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తి వేతనం/గౌరవవేతనంలో 10 శాతం ప్రోత్సాహకం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్‌ పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై, సీవరేజి బోర్డులోని రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్‌ వాటర్‌ సప్లై లైన్‌మన్‌లు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500, జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.5,000, రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బంది, మల్టీపర్పస్‌ వర్కర్లకు రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

మార్చి నెలలో విధులు నిర్వహించిన సిబ్బందికి మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని, వివిధ కారణాల వల్ల ఆయా శాఖల్లో సస్పెండ్‌ అయిన ఉద్యోగులు, అధికారిక, అనధికారిక సెలవుల్లో ఉన్న వారికి ఈ ప్రోత్సాహకాలు వర్తించబోవని స్పష్టం చేశారు.  వేతనాల్లో కోత ‘కట్‌’: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఉద్యోగులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బందికి మార్చి నెల వేతనంలో 10 శాతం వాయిదా వేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గతంలో విడుదల చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు