100 రోజులే గడువు

22 Jan, 2018 16:39 IST|Sakshi
అధికారులకు సూచనలు చేస్తున్న మంత్రి హరీష్‌రావు

గ్రావిటీ కాల్వ పనులు వేగవంతం చేయాలి

భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

కాళేశ్వరం (మంథని): కాళేశ్వరం బ్యారేజీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వ తవ్వకాలకు 100 రోజులే గడువు ఉందని, ఏప్రిల్‌ 30 వరకు పనులు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం జయశశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అన్నారం బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంప్‌ హౌస్‌ వరకు నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వీజేఆర్‌ కంపెనీ 100 రోజుల్లో కోటి క్యూబీక్‌ మీటర్లు, వెల్సా కంపెనీ 30 లక్షల క్యూబీక్‌ మీటర్ల మట్టి తవ్వకాలు జరుపాలని డెడ్‌ లైన్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్‌–జూలైలో కాల్వ నుంచి నీటిని తరలించాల్సి ఉందని, ప్రస్తుతం ఉన్నవి కాకుండా అదనంగా మరిన్ని యంత్రాలను తీసుకువచ్చి పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. అటవీ శాఖ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. తాను 15 రోజుల తర్వాత వచ్చి కాల్వ త్వకాలను పరిశీలిస్తానని తెలిపారు. తరువాత కన్నెపల్లి పంప్‌ హౌస్‌లో ఇరిగేషన్, కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. అన్నారం గోదావరి తీరం వద్ద కాల్వ పనులకు అడ్డంగా ఉన్న ఇసుక క్వారీకి సంబంధించిన ఇసుక కుప్పలను మిషన్ల సాయంతో తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట మంథని ఎమ్మెల్యే పుట్ట మ««ధు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే.జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, డీఎఫ్‌ఓ రవికిరణ్, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈ ప్రకాశ్, మెగా కంపెనీ డైరెక్టర్‌ కృష్ణరెడ్డి, సీజీఎం వేణు, పీఎం వినోద్, ఎఫ్‌డీఓ వజ్రారెడ్డి, రేంజర్‌ రమేష్, డీఎస్పీ కేఆర్‌కే.ప్రసాదరావు, ఎస్సై శ్రీనివాస్‌ ఉన్నారు.

రెండు గంటల పాటు కాల్వ వెంటే... 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుస్తున్న కాళేశ్వరం బ్యారేజీ ప్రాజెక్టు పనులపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. గత 45 రోజులుగా గ్రావిటీ కాల్వ తవ్వకాల పనులు నడుస్తున్న నేపథ్యంలో మంత్రి రెండోసారి కాల్వ బాటపట్టారు. మంత్రి గత నెల 26న పర్యటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఆదివారం దాదాపు రెండు గంటల పాటు కాల్వ వెంట అడవిలోనే ప్రయాణించి తవ్వకాలను పరిశీలించారు. అడవిలో మొత్తం 13.2 కిలోమీటర్లు దూరం 330 హెక్లార్ల అడవిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 9.50 కిలోమీటర్ల తవ్వకాలు
పూర్తయ్యాయి. 

మరిన్ని వార్తలు