105 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

20 Apr, 2016 03:04 IST|Sakshi

ఖమ్మం రూరల్ : మండలంలోని తెల్దారుపల్లి గ్రామం నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 105 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఏనుగు వెంకటేష్, సివిల్ సప్లై డీటీ వేణుగోపాల్ మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కథనం ప్రకారం... తెల్దారుపల్లి గ్రామానికి చెందిన శ్రీను, రాజేందర్ ఇద్దరూ కలిసి మండలంలోని పొన్నేకల్, తల్లంపాడు, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి తదితర గ్రామాల్లో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తెల్దారుపల్లి గ్రామంలో ఓ చోట నిల్వ ఉంచారు. అనంతరం కొనుగోలు చేసిన బియ్యాన్ని మహబూబాబాద్‌కు చెందిన మురళీకృష్ణ రైస్‌మిల్లు యజమానులైన సతీష్, రాధాకృష్ణలకు కేజీకి రూ.14చొప్పున 105 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అమ్మారు.

రైస్‌మిల్లు యజమానులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్  పేరుపై తప్పుడు వేబిల్లులు సృస్టించి కాకినాడ పోర్టుకు తరలించడానికి బియ్యాన్ని వాహనాల్లోకి లోడ్ చేస్తున్నారు. సమాచారం అందడంతో విజిలెన్స్, సివిల్‌సప్లై అధికారులు మాటువేసి పట్టుకున్నారు. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ సత్తిబాబు, బోనకల్ మండలం గోవిందాపురానికి చెందిన బొలేరో వాహనం డ్రైవర్ ఎస్‌కె అబ్దుల్‌నబీ, రైస్‌మిల్లు యజమానులు సతీష్, రాధాకృష్ణ, బియ్యాన్ని అమ్మిన బాణోత్ శ్రీను, బోడపట్ల రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుకున్న బియ్యం విలువ రూ.12.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వారిపై క్రిమినల్ కేసులు న మోదు చేశామని సీఐ వెంకటేష్ తెలిపారు. దాడుల్లో డీటీ సునీల్‌రెడ్డి, ఏఎస్‌ఓ బాలరాజు, విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ పి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు