ఆపరేషన్‌ మర్కజ్‌.. ట్రాన్స్‌ మిషన్‌ 12

9 Apr, 2020 10:26 IST|Sakshi
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తున్న ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించారు. ఈ పన్నెండు ప్రాంతాల్లోనే 89 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. ఈ క్లస్టర్లలో పారిశుద్ధ్యం, క్రిమిసంహారక మందుల స్ప్రేయింగ్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఈ క్లస్టర్లలోని అన్ని ఇళ్లకు వైద్య,ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో కూడిన బృందాలు రెగ్యులర్‌గా వెళ్తాయి. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.

క్లసర్లలోని ప్రజలకు అవసరమైన నిత్యావసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. క్లస్టర్లలో పోలీసు అధికారులు రాకపోకల్ని నిరోధిస్తారు. దాదాపుగా ‘కార్డన్‌ ఆఫ్‌’ అమలు చేస్తారు. ఈ క్లస్టర్ల పరిధిలోని ప్రజల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఆయా వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ బుధవారం  విలేకరులకు వెల్లడించారు. ప్రత్యేక నిఘా, తదితర అంశాల గురించి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తో చర్చించినట్లు తెలిపారు. నిర్ణీత కాలం వరకు బారికేడింగ్,  బందోబస్తు చర్యలు ఉంటాయని తెలిపారు.

ఇవీ కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు..
1) రాంగోపాల్‌పేట 2) షేక్‌పేట్‌ 3) రెడ్‌హిల్స్‌ 4) మలక్‌పేట్, సంతోష్‌నగర్‌ 5) చాంద్రాయణగుట్ట 6) అల్వాల్‌ 7) మూసాపేట 8) కూకట్‌పల్లి 9) కుత్బుల్లాపూర్, గాజులరామారం 10) మయూరీనగర్‌ 11) యూసుఫ్‌గూడ 12) చందానగర్‌

>
మరిన్ని వార్తలు