సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 127కి చేరింది. తెలంగాణలో కరోనా వైరస్తో 9 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
ఆ రెండు శాఖలకు పూర్తి జీతం..
కరోనా నియంత్రణకు విశేష కృషి చేస్తోన్న వైద్య, ఆరోగ్య సిబ్బంది సహా.. పోలీస్ సిబ్బందికి మార్చి నెల పూర్తి జీతం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై ప్రగతి భవన్లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్సెంటివ్ను ఒకటి,రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.