'పంచాయతీలుగా 1700 గిరిజన తండాలు'

28 Feb, 2015 20:01 IST|Sakshi
'పంచాయతీలుగా 1700 గిరిజన తండాలు'

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల పైచిలుకు జనాభా ఉన్న 17వందల గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం, ఎర్రగడ్డ, బాబాయి చెరువు, వన్‌పల్లి తండాలలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన గిరిజన కమ్యూనిటీ భవనాలకు మంత్రి శనివారం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి పెద్ద మొత్తంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల మెనిపేస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నేరవేర్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. గిరిజనుల చిరకాల వాంఛ అయిన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్ల్లు పేర్కొన్నారు. గిరిజనులకు విద్య, ఉపాధి రంగాల్లో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.51వేలను పెళ్లికి ముందే ఇచ్చుటకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అర్హత గల వారందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద నియోజకవర్గానికి రూ.25కోట్లు మంజూరు చేయగా.. అందులో ఎల్లారెడ్డిపేట మండలానికి రూ.8కోట్లు కేటాయించామన్నారు. వీటితో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామన్నారు. రూ.13కోట్లతో సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

(ఎల్లారెడ్డిపేట)

మరిన్ని వార్తలు