మైనార్టీ గురుకులాలకు మరో 1,863 పోస్టులు

21 Jul, 2018 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మైనార్టీ గురుకుల పాఠశాలలకు కొత్తగా 1,863 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. వీటిని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమావేశమయ్యారు. మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయని అధికారులు ప్రస్తావించగా సీఎస్‌ పైవిధంగా స్పందించారు. ఇటీ వల రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 1,321 మంది టీచర్లను నియమించినట్లు గుర్తు చేశారు. జిల్లాల్లోని వక్ఫ్‌ ఆస్తుల జాబితాను రూపొందించాలని, ఆ భూములను విద్యా సంస్థల నిర్మాణానికి వినియోగించేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మైనార్టీ యువతకు వివిధ రంగాలలో మెరుగైన శిక్షణను అందించడానికి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయాలని సూచించారు.

షాదీ ముభారక్‌ ద్వారా 24,662 మం ది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 11,746 మందికి మంజూరు చేశామని, మిగతా వాటికి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. విదేశీ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు 968 మందిని ఎంపిక చేసి రూ.109 కోట్లు ఖర్చు చేశామన్నారు. మల్టీ సెక్టో రల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 2016–17లో 7 మైనార్టీ గురుకులాల నిర్మాణానికి కేంద్రం రూ.126 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొదటి దశలో కేంద్రం రూ.37.80 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25.20 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే 2017–18లో మరో 6 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూ రు చేసిందని, కేంద్ర వాటా కింద రూ.10.08 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.21.60 కోట్లు విడుదలయ్యా యని వెల్లడించారు. సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవ లప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ ద్వారా సివిల్స్, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాల కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి పథకాల మంజూరును వేగవంతం చేయాలన్నారు.

>
మరిన్ని వార్తలు