పగలు వ్యాపారం...రాత్రి దొంగతనాలు

5 Aug, 2015 19:08 IST|Sakshi

జగద్గిరిగుట్ట(రంగారెడ్డి జిల్లా): పగటి పూటంతా చిరు వ్యాపారాల పేరుతో తిరుగుతూ రెక్కీ వేసి... రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాపిరెడ్డినగర్‌కు చెందిన ఎండీ సద్దాం(22), రంగారెడ్డి నగర్‌కు చెందిన ఎండీ సమీర్(27) స్నేహితులు. వీరిద్దరూ వివిధ వ్యాపారాల పేరుతో పగటి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను పసిగడతారు. కన్నం వేసేందుకు ప్లాన్ తయారు చేసుకుంటారు.

పథకం ప్రకారం రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్‌బెస్టాస్ కాలనీకి చెందిన సంపత్ కుమార్ తన కుటుంబంతో జూలై 16వ తేదీన పుష్కరాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న రూ. 45 వేల నగలను చోరీ చేశారు. అదే విధంగా గుబురుగుట్టలోని సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన ఎ.తార ఇంటి తాళం పగుల గొట్టి రూ.50 వేల విలువ గల ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ వరుస దొంగతనాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సద్దాం, సమీర్‌లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

>
మరిన్ని వార్తలు