‘పరుగు’లోనే ఆగిన గుండె

16 Dec, 2019 02:09 IST|Sakshi

రేగోడ్‌ (మెదక్‌)/సంగారెడ్డి మున్సిపాలిటీ: పోలీసు ఉద్యోగంలో చేరాలనుకున్న ఓ గిరిజన విద్యార్థి గుండెపోటుతో దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం పెద్దతండాకు చెందిన రంజానాయక్, చాందీబాయి దంపతుల రెండో కుమారుడు మహిపాల్‌ (20) సంగారెడ్డిలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుకుంటూ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగం రెండు మార్కులతో చేజారిపోయింది.

గతంలో ఆర్మీ సెలక్షన్‌కు సైతం వెళ్లాడు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే ఆదివారం ఉదయం సంగారెడ్డిలో ఉన్న గ్రౌండ్‌లో రన్నింగ్‌ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. 108 అంబులెన్స్‌ వచ్చేసరికే మహిపాల్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త వినగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పెద్దతండాకు తీసుకొచ్చారు. మహిపాల్‌ కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు