ముసాయిదా జాబితా విడుదల
అక్టోబర్ 31 వరకు అభ్యంతరాలు
జనవరి 4న తుది జాబితా
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
సీఈవో కార్యాలయం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (టీఎస్సీఈవో) ఈ మేరకు రాష్ట్రంలోని ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించారు. టీఎస్సీఈవో రజత్కుమార్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.61 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.28 కోట్ల మంది మహిళలు, 2,439 మంది థర్డ్ జెండర్ కేటగిరి వారు ఉన్నారు.
ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 1 నుంచి అభ్యంతరాలను, ప్రతిపాదనలను స్వీకరించనున్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలను, ప్రతిపాదనలను పరిశీలించి ఈ ఏడాది నవంబర్ 30లోపు పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు గుర్తింపు కార్డు పొందాలని కోరారు.